పెద్దపల్లి : రామగుండం నియోజకవర్గంలోని రైల్వే ప్రయాణికుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ కోరారు. శుక్రవారం రామగుండం రైల్వే స్టేషన్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్కు వినతి పత్రం అందజేశారు. పెద్దంపేట్ లో రైల్వే గేట్ కారణంగా అంతర్గాం, గోదావరిఖనికి వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉంటున్నారని, ఈ సమస్య పరిష్కరించేందుకు రైల్వే ఓవర్ బిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.
రామగుండం రైల్వే స్టేషన్ ఆవరణలోకి ఆటోలను అనుమతించాలని , రైల్వే స్టేషన్ ఆవరణలో పార్కింగ్ షెడ్ ఎర్పాటు చేయాలని వినతిపత్రంలో కోరారు. రామగుండం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతామని రామగుండం రైల్వే స్టేషన్ లో నవజీవన్,లోకమాన్య తిలక్, స్వర్ణ జయంతి తదితర ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపాలని కోరారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కన్నూరి సతీశ్ కుమార్, ఎంపీటీసీ కోలిపాక శరణ్య మధుకర్ రెడ్డి, నాయకులు బోడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు.