తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 17: వందల మంది ఉద్యమకారులను బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఉస్మానియా (ఓయూ) విద్యార్థులు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థులు ఆందోళన చేశారు. రాహుల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు అరవింద్, సంతోష్, యాదగిరి, రాజ్కుమార్, అమరేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధన ఉద్యమంలో వందల మంది ఆత్మహత్యలకు కాంగ్రెస్సే కారణమని ధ్వజమెత్తారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని ప్రకటించడంలో ఆలస్యం చేసి వందల మందిని పొట్టనబెట్టుకున్న ఆ పార్టీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కులేదని మండిపడ్డారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతను బలితీసుకున్న కాంగ్రెస్ తెలంగాణ పాలిట భూతం వంటిదని విరుచుకుపడ్డారు. తెలంగాణలో అడుగుపెడుతున్న రాహుల్.. అమరుల చావులకు క్షమాపణ చెప్పి ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతల హామీలు అమలుకు నోచుకోనివని, ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని కోరారు. సుస్థిర పాలనను అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనసాగించేలా ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.