హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi) వరంగల్ వచ్చే ధైర్యం లేక పారిపోయారని
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకిచ్చిన హామీలపై నిలదీస్తారనే భయంతో రాహుల్ గాంధీ వరంగల్ (Warangal Tour ) పర్యటనను రద్దు చేసుకున్నారని ఆరోపించారు.
వరంగల్ లో రాహుల్ గాంధీ చ్చిన రైతు డిక్లరేషన్ ( Farmer Declaration) అమలే కాలేదని విమర్శించారు. ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరని అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మకం లేక ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చారని విమర్శించారు.
సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి చిలుక పలుకులు పలికారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ముఖం కాదు. సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీల ముఖం చూసి మహిళలు కొంత వరకు ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2500 ఇవ్వడం లేదు . రేవంత్ రెడ్డి మహిళలకు రూ .35 వేల చొప్పున బాకీ పడ్డారని ఆరోపించారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా శంఖారావం
రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఏర్పడిందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందని అన్నారు. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందని, శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగలు చెలరేగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క మతకల్లోలం జరగలేదని,రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకా ఎక్కడో ఒక చోట తరుచూ మతకల్లోలాలు జరుగుతున్నాయి,రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.
భద్రత కోసం పోరాటం చేయాల్సిరావడం బాధాకరం
భద్రత కోసం కూడా మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని అన్నారు. కేసీఆర్ పై అక్కసుతో కేసీఆర్ కిట్ లను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని కవిత దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ ఆస్పత్రులపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి బస్సుల సంఖ్యను తగ్గించారని, బీడీ కార్మికులకు పెన్షన్ ను 4 వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.