హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి తాను ముద్దపప్పు అని మరోసారి నిరూపించుకున్నారని టీఎస్రెడ్ కో చైర్మన్ వై సతీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయాలని ఆతృత తప్ప ఆయన ప్రసంగంలో మరేమీ కనిపించలేదని పేర్కొన్నారు. లక్ష కోట్లు కూడా ఖర్చు కాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారంటేనే రాహుల్ ఎంత పెద్ద ముద్దపప్పో అర్థమైందని ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్ కాకతీయపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. 60 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నీటి వనరులను పరిరక్షించలేదని, తెలంగాణలో ఉన్న గొలుసు కట్టు చెరువులు కాంగ్రెస్ నేతల కబ్జాలకు బలయ్యాయని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పునరుజ్జీవం వచ్చిందని తెలిపారు. పోడు భూములపై రాహుల్ గాంధీ మాట్లాడటం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అడవి బిడ్డలు పట్టాలు కావాలని అడిగితే వారిని కాల్చి చంపిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్దని దుయ్యబట్టారు. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ అడవి బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చి, రైతుబంధు, రైతు బీమా కూడా వర్తింపజేశారని చెప్పారు.