వరంగల్ చౌరస్తా, జనవరి 13: వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాల అనస్థీషియా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్య కేసులో యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానాన్ని హైకోర్టు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కేఎంసీ అనస్థీషియా ద్వితీయం సంవత్సరం విద్యార్థి సైఫ్ అలీ అభ్యర్థన మేరకు కోర్టు విడుదల చేసిన ఉత్తర్వులను అనుసరించి యాంటీ ర్యాగింగ్ కమిటీ పునఃవిచారణ జరిపింది. ఇందులో నిందితుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని నమ్మిన కమిటీ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సస్పెన్షన్ సరైనదిగా మరో మారు తీర్మానించి కోర్టుకు అందజేసింది. కమిటీ తీర్మానంపై సైఫ్ హైకోర్టును ఆశ్రయించాడు. అతడి వాదనను సమర్థిస్తూ కోర్టు యాంటీ ర్యాగింగ్ కమిటీ తీర్మానాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.