గంగాధర, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో సమూల మార్పులు వచ్చాయని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గట్టుభూత్కూర్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి గురువారం పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గట్టు గ్రామంలోని నర్సరీ, ఆధునిక వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్డు, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. కొత్తపల్లి మండలం ఎలగందులలో బృహత్ పల్లెప్రకృతి వనాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయకముందు రాష్ట్రంలో ఉన్న 8 వేల గ్రామ పంచాయతీలుంటే 3 వేల మంది పంచాయతీ కార్యదర్శులు ఉండేవారని, రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక్క పంచాయతీ కార్యదర్శి పని చేసేవాడని గుర్తు చేశారు.
చిన్న గ్రామాలతో అభివృద్ధి సాధ్యమని రాష్ట్రంలో కొత్తగా 4 వేల గ్రామాలను ఏర్పాటు చేయడంతో పాటు 9 వేల పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల గ్రామ పంచాయతీల ఖాతాల్లో రూ.250 కోట్లను ప్రభుత్వం జమ చేస్తోందన్నారు. పల్లెప్రగతితో గట్టుభూత్కూర్ గ్రామాన్ని ఆదర్శంగా నిలుపుతున్న సర్పంచ్ కంకణాల విజేందర్రెడ్డిని ఆయన అభినందించారు.