హైదరాబాద్ : రూ. 200 కోట్లతో హైదరాబాద్ సమీపంలో రాధాకృష్ణ మందిరాన్ని నిర్మించాలని ఇస్కాన్ ప్రతిపాదించింది. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించ తలపెట్టిన మందిరానికి భూమిని కేటాయించాలంటూ ఇస్కాన్ ప్రతినిధులు అరణ్య భవన్లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్కు సమీపంలో సంగారెడ్డి జిల్లాలో సాధారణ ధరకు లీజు పద్ధతిలో అనువైన స్థలాన్ని కేటాయించాలని మంత్రిని కోరారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని, ఆయన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు.
మందిర ప్రాంగణంలో గురుకులం, వృద్ధాశ్రామం, గోశాల కూడా నిర్మించనునున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇస్కాన్ విశాఖనగర శాఖ అధ్యక్షుడు సాంబదాస్ ప్రభుజీ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఇతర ఇస్కాన్ ప్రతినిధులు పాల్గొన్నారు.