హైదరాబాద్ సిటీబ్యూరో, షాబాద్/చింతలమానేపల్లి మే 22 (నసమస్తే తెలంగాణ): నిషేధిత పత్తి విత్తనాలు సరఫరా చేస్తూ అమాయక రైతులను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.36 లక్షల విలువైన 1,440 కిలోల నిషేధిత బీజీ-3 పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సురేశ్యాదవ్ కర్ణాటకకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి నిషేధిత బీజీ-3 పత్తి విత్తనాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, రాష్ట్రంలోని అమాయక రైతులకు విక్రయిస్తుంటాడు.
ఈ క్రమంలో మంచిర్యాల జిల్లాకు చెందిన పులికొండ యశ్వంత్కుమార్కు ఒక్కో ట్రిప్పుకు రూ. 40వేలు చెల్లించి కర్ణాటక నుంచి ఈ విత్తనాలను రాష్ర్టానికి తెప్పిస్తాడు. సురేశ్యాదవ్ సూచన మేరకు యశ్వంత్కుమార్ ఖాళీ వాహనంతో కర్ణాటకలోని సిందనూర్కు వెళ్లి, 1200 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు లోడ్ చేసుకుని నగరానికి బయలుదేరాడు. సమాచారం మేరకు ఎస్వోటీ, వ్యవసాయశాఖ అధికారులు కలిసి శంకర్పల్లిలోని జీనోమ్ వ్యాలీ ప్రాం తంలో వాహనంలో వస్తున్న యశ్వంత్కుమార్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 1200 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకొన్నారు.
మరో కేసులో రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ఎల్వర్తి బస్స్టాప్ వద్ద నిషేధిత పత్తి విత్తనాలు తరలిస్తున్న బొర్ర శివకుమార్ (వెలమల గ్రామం), అశిరెడ్డిగారి శ్రీనివాస్రెడ్డి (ఎల్వర్తిగ్రామం), మడమంచి ఉదయ్కుమార్ అలియాస్ కిరణ్ (ఫత్తేపురం గ్రామం)ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.6 లక్షల విలువైన 240 కిలోల నిషేధిత పత్తి విత్తనాలను సీజ్ చేశారు. కాగా, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం అంతర్రాష్ట్ర వంతెన వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. గంగాపూర్ గ్రామానికి చెందిన చాపిలే వినోద్, బోళ్లబోయిన అశోక్, కృష్ణ, పురుషోత్తం రెండు మోటార్ సైకిళ్లపై 70 కిలోల ైగ్లెసిల్ పత్తి విత్తనాలను మహారాష్ట్రకు తరలిస్తూ పట్టుబడ్డారు. చాపిలే వినోద్ పట్టుబడగా.. అశోక్, కృష్ణ, పురుషోత్తం పరారయ్యారు. ఈ నకిలీ పత్తి విత్తనాల విలువ సుమారు 1.50 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు.