ప్రారంభించిన రేస్ఎనర్జీ
హైదరాబాద్, జూన్ 29: హైదరాబాద్లో రేస్ఎనర్జీ ఓ కొత్త బ్యాటరీ ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభించింది. 10వేల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేసింది. ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం 30వేల బ్యాటరీలుగా ఉన్నది. ఈ హైదరాబాద్ ఆధారిత సంస్థ బ్యాటరీల మార్పిడికి సంబంధించి డీప్ టెక్ ఎలక్ట్రిక్ వెహికిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేవలందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్లాంట్ను 50 మెగావాట్ బ్యాటరీ ఉత్పత్తి ఎక్విప్మెంట్తో తెచ్చారు.
80వేల బ్యాటరీల ఉత్పత్తి
2025కల్లా 80వేల ద్విచక్ర, త్రిచక్ర వాహన బ్యాటరీల ఉత్పత్తే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే మార్కెట్లో మార్పిడికి అనువైన 2.5 లక్షల బ్యాటరీలను అందుబాటులో ఉంచాలనీ చూస్తున్నది. ఇక ఈ కొత్త ఉత్పాదక కేంద్రంలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) కోసం కటింగ్-ఎడ్జ్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని సంస్థ ఈ సందర్భంగా వెల్లడించింది. క్రమేణా ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూపోతామన్న సంస్థ.. ఇక్కడ పనిచేసే ఇంజినీర్లు, డిజైనర్లకు ఎంతో సహకార వాతావరణాన్ని కల్పించినట్టు పేర్కొన్నది.
మా వ్యాపార ప్రయాణంలో ఈ ప్లాంట్ ప్రారంభం ఓ గొప్ప మైలురాయి. ఎలక్ట్రిక్ మొబిలిటి రంగంలో విప్లవాత్మక మార్పులకు ఇది దోహదపడుతుంది. ప్రస్తుతం రోజూ 500 బ్యాటరీలను మారుస్తున్నాం. డిమాండ్ పెరిగినకొద్దీ మరింతగా విస్తరిస్తాం
-అరుణ్ శ్రేయస్, రేస్ఎనర్జీ సహవ్యవస్థాపకుడు
ఈవీలకు అవసరమైన కీలక విడిభాగాలను స్థానికంగానే ఉత్పత్తి చేయాలన్నది మా లక్ష్యం. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. దేశ, విదేశీ అవసరాలను తీర్చేలా విస్తరణపై దృష్టి పెడుతున్నాం. రకరకాల విద్యుత్తు ఆధారిత వాహనాల కోసం మార్పిడికి అనువైన బ్యాటరీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం
-గౌతమ్ మహేశ్వరన్, రేస్ఎనర్జీ సహవ్యవస్థాపకుడు