హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల విద్యాలయాల టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.2,000 కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. తమ తప్పులు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్న రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రుల సవాల్ను స్వీకరిస్తున్నామని, గురువారం ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బహిరంగచర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ఎక్స్ వేదికగా ప్రతి సవాల్ విసిరారు. ‘మా ఆరోపణల్లో అవాస్తవాలు ఉంటే.. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్రెడ్డి, సంక్షేమ శాఖల మంత్రులు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, అజారుద్దీన్ కలిసి ప్రెస్క్లబ్కు ఆధారాలతో వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలి.
వారు చర్చకు వస్తారా? లేక అటెన్షన్ డైవర్షన్ రాజకీయాలతో తప్పుకొంటారా? అనేది గురువారమే తేలుతుంది’ అని ప్రవీణ్కుమార్ స్పష్టంచేశారు. ఈ చర్చ బలమైన సాక్ష్యాధారాలు, సుహృద్భావ వాతావరణంలో జరుగాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. హైకోర్టు మార్పులు చేయాలని సూచించినా జీవో 17ను చట్టవిరుద్ధంగా ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తున్నది? టెండర్లలో సెంట్రలైజ్డ్ పద్ధతిని తీసుకొచ్చి తెలంగాణ స్థానిక కాంట్రాక్టర్లను కాదని, ఇతర రాష్ట్రాల వారికి ఎందుకు దోచిపెడుతున్నారు? అని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. కాంగ్రెస్ తన డిక్లరేషన్లలో ప్రకటించిన విధంగా గురుకుల కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీలకు 12శాతం, బీసీలకు 42శాతం చొప్పున రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయడం లేదు? అని నిలదీశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఈఎండీలో 50 శాతం రాయితీని ఎందుకు రద్దు చేశారు? టర్నోవర్, సెక్యూరిటీ డిపాజిట్ నిబంధనలు ఎవరి కోసం మార్చారు? అని ధ్వజమెత్తారు.
వివాదాస్పదులకు కాంట్రాక్టులిస్తరా?
‘ఏ ప్రాతిపదికన మఫత్లాల్ సంస్థకు యూనిఫామ్, దుప్పట్లు, టవల్స్ సరఫరా చేసే కాంట్రాక్ట్ ఇచ్చారు? ఇది చేనేత కార్మికులను మోసం చేయడం కాదా?’ అని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ నిలదీశారు. టోనీ అనే డ్రగ్ పెడ్లర్తో సంబంధాలున్న నిరంజన్ జైన్ కంపెనీకి ట్రంకు బాక్సుల సరఫరా కాంట్రాక్ట్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. సైప్లె కాంట్రాక్ట్ రాజేశ్ అగర్వాల్కు ఎందుకు ఇచ్చారు? తెలంగాణలోని లోకల్ తోలు వ్యాపారులకు (మాదిగ లేదా ఇతర సామాజిక వర్గాలకు) ఎందుకు ఇవ్వలేదు? కరెన్సీ నోట్లు, రెవెన్యూ స్టాంపులకు వాడే వాటర్ మార్ నిబంధనను పిల్లల నోట్పుస్తకాల పేపర్కు ఎవరి ప్రయోజనాల కోసం చేర్చారు? అని మండిపడ్డారు. రూ.2,041 కోట్ల భారీ టెండర్లు ఖరారైనా, విద్యార్థులకు ఇప్పటికీ వస్తువులు ఎందుకు అందడం లేదు? అధికారులతో రాత్రికి రాత్రే నిబంధనలు మార్పిస్తూ రూ.వేల కోట్లను అక్రమంగా దోచుకోవడానికి ఎందుకు ప్రణాళికలు వేస్తున్నారని నిలదీశారు.