మహబూబ్నగర్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై సినీనటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి ధ్వజమెత్తారు. ‘కేంద్రమేందిరో.. వాని పీకుడేందిరో’ అంటూ గళమెత్తారు. బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాకేంద్రంతోపాటు మల్దకల్లో పలు అభివృద్ధి పనులకు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మల్దకల్లో మాట్లాడుతూ.. రైతు పండించే ప్రతి గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆహార భద్రత చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఎఫ్సీఐ ధాన్యం కొనాల్సిందేనని స్పష్టంచేశారు. కరెంటు, నీళ్లు, పెట్టుబడి సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మార్చిందని అభినందించారు. తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోలు చేయాలని అడిగేందుకు ఢిల్లీకి వెళ్తే పని లేదా.. అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఢిల్లీ ఏమైనా మీ అబ్బ సొత్తా? అని ప్రశ్నించారు. రైతుల కోసం వచ్చిన మంత్రులను అవమానించడం తగదని హితవు పలికారు.