కాచిగూడ, సెప్టెంబర్ 8 : సీఎం రేవంత్రెడ్డి ఫీజు బకాయిలు చెల్లించకుంటే రెండు,మూడు రోజుల్లో మందలాది మంది విద్యార్థులతో అసెంబ్లీని ముట్టడిస్తామని రాజ్యసభ సభ్యు డు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్స్ పర్లగోర్ల మోడీరాందేవ్, నిఖిల్పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం బర్కత్పుర రెడ్డి మహిళా కళాశాల రోడ్డులో పెండింగ్ ఫీజుల బకాయిలను విడుదల చేయాలని కోరుతూ వందలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్య రాజ్యాంగబద్ధమైన హక్కు అని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద విద్యార్థులకు వరంలాంటిదని తెలిపారు. దీనిని బలహీనపర్చే చర్యలు ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, వెంటనే రూ.10వేల కోట్ల బకాయిలను చెల్లించాలని కోరారు. ఫీజు బకాయిలు చెల్లించకుంటే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తిరుగకుండా తరిమి కొడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఫీజు బకాయిల కారణంగా లక్షలాదిమంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందటం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని పెండింగ్ బకాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాజు నేత, నరేశ్ గౌడ్, బాలయ్య, వంశీ, విద్యార్థులు పాల్గొన్నారు.