ప్యారిస్ : ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ సోమవారం సిబ్బంది సమ్మె కారణంగా మూతపడింది. శనివారం బోచసన్వాసి అక్షర పురుషోత్తమ స్వామి నారాయణ సంస్థ(బీఏపీఎస్) ప్రతినిధి బృందం సందర్శన సందర్భంగా మహిళా ఉద్యోగులను విధుల నుంచి తప్పించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమ్మె జరిగింది. అయితే టవర్ నిర్వహణ సంస్థ ఈ విషయంలో జరిగిన తప్పిదాన్ని అంగీకరించింది. ఇలాంటి అభ్యర్థనలను అంగీకరించకుండా ఉండాల్సిందని పేర్కొంది.
శనివారం బీఏపీఎస్ ప్రతినిధి బృందం టవర్ సందర్శన సమయంలో మహిళా ఉద్యోగులను వెళ్లిపోవాలని, వారి స్థానాల్లో పురుష ఉద్యోగులు బాధ్యతలు చేపట్టాలని కోరినట్లు యూనియన్ ప్రతినిధి డయాన్ దవోయాన్ ‘రాయిటర్స్’కు తెలిపారు. దీనిని మహిళా సిబ్బంది అవమానంగా భావించారని, తర్వాత యాజమాన్యంతో చర్చించారన్నారు. కాగా ఈ విషయమై స్పందించిన బీఏపీఎస్ తమ ప్రవేశం సమయంలో మహిళా సిబ్బందిని అడ్డుకున్న విషయం తమకు తెలియదని, ఈ ఘటన కారణంగా ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొంది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్యారిస్ మేయర్ ఇమాన్యుయేల్ గ్రెగోయిర్ దీనిపై వెంటనే దర్యాప్తు చేయిస్తామన్నారు.