ముషీరాబాద్, జూన్ 13: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు పేరుతో రోజుకో జీవో జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో పాత విధానాన్నే కొనసాగించాలని, ఇటీవల జారీ చేసిన 8, 9 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీజు బకాయిలు ఎగ్గొట్టాలనే కుట్రలో భాగంగా కొత్త జీవోలు విడుదల చేసి విద్యార్థులను గందరగాళానికి గురిచేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు గడిచినా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదని, ఇప్పుడు నెలకు 300 కోట్లు ఇస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు.
ఫీజు బకాయిలు అలాగే ఉంచి ఇక నుంచి 300 కోట్ల చొప్పున ఇస్తామని ప్రభుత్వం నమ్మబలుకుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం జీవో 7ను ఏప్రిల్ 30న జారీచేసి, దాన్ని ఇటీవల రద్దు చేసిందని చెప్పారు. తర్వాత మరో రెండు జీవోలు 8, 9 లను జారీ చేసి విద్యార్థులను ఆందోళనలను గురిచేస్తున్నదని ఆరోపించారు. ఆర్ఆర్ యాక్టు(రెవెన్యూ రికవరీ యాక్టు)ను విద్యార్థులపై ప్రయోగిస్తామంటూ భయపెడుతూ పూటకో జీవో జారీ చేస్తున్నదని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తున్నదని, ఫీజులు, స్కాలర్ షిప్లు విద్యార్థుల ఖాతాలో వేయడం సరికాదని పేర్కొన్నారు. విద్యార్థుల ఖాతాలో వేస్తే కాలేజీ యజమాన్యాలు మొదట ఫీజు కట్టమని ఒత్తిడి తెస్తాయని, ఫీజులు కట్టే వరకు అడ్మిషన్లు ఇవ్వకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉన్నదని చెప్పారు. విద్యార్థులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించే ప్రయత్నం మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు ర్యాగ అరుణ్కుమార్, రాములు యాదవ్, జిల్లపల్లి అంజి, అనంతయ్య, మోడీ రామ్దేవ్, వంశీ మోహన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.