హైదరాబాద్, ఫిబ్రవరి19 (నమస్తే తెలంగాణ): బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. జనాభాలో 56 శాతంగా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడంతో విద్య, ఆర్థిక రంగాల్లో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పోస్ట్, ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ల అమలులో బీసీలకు అనేక న్యాయసంబంధ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఎస్సీలకు 15శాతం, గిరిజనులకు 7శాతం రిజర్వేషన్లు ఉన్నా ప్రత్యేక మంత్రిత్వశాఖలు ఉన్నాయని, 27శాతం రిజర్వేషన్ పొందుతున్న బీసీల కోసం శాఖ ఏర్పాటు చేయకపోవడం ఏమిటని కృష్ణయ్య ప్రశ్నించారు. ఈ మేరకు ప్రధాని మోదీ వెంటనే చొరవ తీసుకోవాలని కోరారు.