హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు మెస్, నిర్వహణ బిల్లులను వెంటనే విడుదల చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ గత 10 నెలల బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులందక హాస్టళ్లకు నిత్యావసర సరుకుల సరఫరాను వ్యాపారులు నిలిపేస్తున్నారని, భవనాల అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని వాపోయారు. కార్యక్రమంలో తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలం వెంకటేశ్, రాజేందర్, రాజ్కుమార్, రామ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.