హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)/ముషీరాబాద్: తెలంగాణ ప్రజలకు బీసీ ముఖ్యమంత్రి పదవి కంటే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల బిల్లే ముఖ్యమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని 30 ఏండ్లుగా ఉద్యమాలు చేస్తున్న విషయాన్ని లేఖలో స్పష్టంచేశారు. ఇటీవల మహిళ బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలని బీఆరెస్, ఎస్పీ, ఆర్జేడీ, డీఎంకే, వైఎస్సార్సీపీ తదితర పార్టీలు బీసీల పక్షాన పార్లమెంటులో మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతుగా ఉన్నాయని ఈ క్రమంలో బీజేపీ పార్టీకి ఉన్న అభ్యంతరం, అవరోధం ఏమిటని ప్రధానిని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీసీల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఆర్ కృష్ణయ్య లేఖలో ప్రధానిని డిమాండ్ చేశారు. ఏటా రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి జాతీయ స్థాయిలో సాలర్షిప్ పథకం, ఫీజు రీయంబర్స్మెంట్ పథకం, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, స్టడీ సరిల్స్, బీసీలకు ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల బీసీబంధు పథకం ప్రవేశపెట్టాలని కోరారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆరోగ్య, రాజకీయ అభివృద్ధికి ఎజెండాతో ముందుకు పోవాలలే కానీ బీసీ సీఎం పదవితో ఒరిగేదేమీలేదని స్పష్టం చేశారు.