SSC Paper Leak | హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సంజయ్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది. నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బండి దాఖలు చేసిన పిటిషన్ విచారణను జూన్ 16కి వాయిదా వేసింది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన కమలాపురం జెడ్పీ హైసూల్ ప్రధానోపాధ్యాయుడు ఎం శివప్రసాద్, ఇతర ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
తొలుత అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, పదో తరగతి పేపర్ లీకేజీ కేసు దర్యాప్తునకు ప్రధాన నిందితుడైన బండి సంజయ్ దర్యాప్తునకు సహకరించకపోగా, పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు కీలకమైన సెల్ఫోన్ను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వెనుక కుట్ర కోణాన్ని బట్టబయలు చేయాలంటే బండి సెల్ఫోన్లోని డాటాను పరిశీలించాల్సి ఉన్నదని వివరించారు. బండి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. సీఆర్పీసీలోని 41ఏ సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేయడం అన్యాయమని తెలిపారు. ఏజీ బీఎస్ ప్రసాద్ కల్పించుకుని, బండి సంజయ్ను అరెస్టు చేసిన తర్వాత టెన్త్ పరీక్ష పత్రాల లీకేజీ జరుగలేదని పేర్కొన్నారు. పేపర్ లీకేజీలను ప్రోత్సహించడం చట్ట ప్రకారం తీవ్ర నేరమని, బండికి ఏ విధమైన ఉపశమనం కల్పించకూడదని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన హైకోర్టు.. విచారణను జూన్ 16కి వాయిదా వేసింది.
గుజరాత్ సహా పలు రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయని విచారణ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది.