Swatch Badi | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే స్వచ్ఛతలో కేంద్రం నుంచి ప్రశంసలు అందుకున్న సిద్దిపేట.. ఇప్పుడు ప్రతి విద్యార్థికి స్ఫూర్తిగా నిలిచింది. సిద్దిపేటలోని ఇబ్రహీంపూర్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతల నిర్మాణం ఒక ప్రయోగత్మాకం అంటూ పాఠ్యాంశాల్లో పొందుపరిచారు. సిద్దిపేట స్వచ్ఛత గురించి పాఠ్యాంశాలకే పరిమితం కాలేదు.. ప్రశ్నాపత్రం దాకా చేరింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లో సిద్దిపేట స్వచ్ఛ బడి గురించి నాలుగు మార్కుల ప్రశ్నను బోర్డు అధికారులు అడిగారు.
మంత్రి హరీశ్రావు ఇటీవలే సిద్దిపేటలో స్వచ్ఛ బడిని ప్రారంభించారు. చెత్తను సేకరించడం ఎలా? తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ప్రజారోగ్యంపై శ్రద్ధ, ప్లాస్టిక్ నిర్మూలన, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించడం వంటి అంశాలను బోధిస్తున్నారు. ఈ కేంద్రం బెంగళూరుకు చెందిన డాక్టర్ శాంతి పర్యవేక్షణలో కొనసాగుతోంది. స్వచ్ఛ బడిలో పిల్లలు, పెద్దలతో పాటు ఎవరైనా ప్రవేశం పొందొచ్చు. అయితే స్కూల్ విద్యార్థులు, డ్వాక్రా మహిళలపై అధికంగా దృష్టి సారించనున్నారు. అన్ని అంశాలపై డిజిటల్ క్లాసుల సహాయంతో పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఈ అంశంపై మొత్తం ఆరు ప్రశ్నలు అడిగి, నాలుగింటికి సమాధానాలు రాయాలని ప్రశ్నాపత్రంలో పేర్కొన్నారు.
స్వచ్ఛ బడిపై ఇంటర్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్లో ప్రశ్న రావడం సిద్దిపేట ప్రజల చైతన్యానికి గొప్ప వరమని, అభివృద్ది సార్థకతకు నిదర్శనమని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత , పచ్చదనంలో భాగంగానే సిద్దిపేటలో స్వచ్ఛ బడిని ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. స్వచ్ఛ బడి నుంచి ఇప్పటికే వేలాది మంది అనేక విషయాలు తెలుసుకున్నారని చెప్పారు. ఇప్పుడు లక్షలాది మంది హాజరయ్యే ఇంటర్ బోర్డు ఎగ్జామ్ పరీక్ష పత్రంలో స్వచ్ఛ బడికి చోటు దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ విషయం మాకు, మా సిద్దిపేట మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది ముఖ్యంగా మా ప్రజలకు గర్వకారణం అని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని వినూత్నమైన, ఆదర్శమైన కార్యక్రమాలను చేపడుతామని హరీశ్రావు స్పష్టం చేశారు.