All GO’s Public Domain | హైదరాబాద్: ప్రజా పాలన అని చెప్పుకొంటున్న ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ అన్ని జీవోలను బహిర్గతం చేయడం లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. 2023, డిసెంబర్ 7 నుంచి 2025, జనవరి 25 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 19,064 జీవోలు తెచ్చింది. కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టింది కేవలం 3,290 జీవోలు మాత్రమే అని అన్నారు. 15,74 జీవోలను దాచిపెట్టిందని, అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోర్టుకు వెళ్లామని తెలిపారు. 8 వారాల్లో అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుందని, కోర్టులు అంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని మండిపడ్డారు. కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మళ్లీ పిటిషన్ దాఖలు చేశామని వెల్లడించారు. ఆనాడు కేసీఆర్ హయంలో జీవోలను దాచిపెడుతున్నారని గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలన అంటే జీవోలను దాచిపెట్టడమేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవోలు మాయం
కేసీఆర్ 2015లో జీవో 4 తెచ్చి, ప్రతి జీవోను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం SC శాఖలో 259 జీవోలకు 4, ST శాఖలో 266 జీవోలకు 3, BC శాఖలో 288 జీవోలకు 88, మైనార్టీ శాఖలో 155 జీవోలకు 2 మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. SC, ST, BC ల ప్రభుత్వం అని చెప్పుకొటున్న రేవంత్ రెడ్డి జీవోలను ఎందుకు దాచిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనరల్ డిపార్ట్మెంట్లో 2,238 జీవోలకు 89, ఆరోగ్య శాఖలో 1,048 జీవోలకు 1 మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టారని తెలిపారు. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటతో సహా వివిధ శాఖల జీవోలను మాయం చేశారని ఆరోపించారు. జీవోలు మాయం కావడానికి గల కారణం ఏంటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
అనర్హులకు పదవులు
క్యాబినెట్ ర్యాంక్ లేనివారికి పదవులు కట్టబెడుతున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. RR ట్యాక్స్ వసూలు చేసేందుకు వారికి పదవులు ఇస్తున్నారని అనుమానం కలుగుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవోలను బయటపెట్టాలని, లేకపోతే.. ఇందిరమ్మ రాజ్యం కాదని, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అవుతుందని హితవు పలికారు. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకపోతే కోర్టు ధిక్కరణ కింద జైలుకు వెళ్లేది అధికారులే అని, మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే అని, ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. చీకటి దందా చేసే అధికారులే దీనికి బాధ్యత వహించాల్సి వస్తుందని సూచించారు. సచివాలయంలో ల్యాండ్ సెటిల్మెట్ అగ్రిమెంట్లలకు జీవోలు తెస్తున్నారు అని అన్నారు. ప్రజా సంక్షేమ కోసం మంత్రుల పేషీలు పనిచెయ్యడం లేదని, జీవోలు ఎక్కడకి వెళ్తున్నాయని అడిగే దమ్ము అసమర్థ మంత్రులకు లేదని మండిపడ్డారు. సచివాలయం నేడు పైరవీకారులకు అడ్డగా మారిందని, ప్రజా పాలనా కాస్త పైరవికారుల, దళారుల పాలనగా మారిందని ఎద్దేవా చేశారు. RTA చట్టం తెచ్చిన సోనియా గాంధీపై అభిమానం ఉంటే ఆ చట్టాన్ని గౌరవించి అన్ని జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని కోరారు.