Assembly Session | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే శాసనసభ, శాసన మండలిలో క్వశ్చన్ అవర్ను రద్దు చేశారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల నివేదికను ఇవాళ ఉభయ సభల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. అలాగే తెలంగాణ సమాచార కమిషన్ వార్షిక నివేదికలను కూడా ఆయన సభలో ప్రవేశపెడతారు.
ఇక తెలంగాణ వాణిజ్య ప్రోత్సాహక సంస్థ లిమిటెడ్ ఎనిమిదో వార్షిక నివేదికను మంత్రి శ్రీధర్ బాబు సభా సమక్షంలో ఉంచనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర చర్మ పరిశ్రమ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నాలుగో వార్షికోత్సవ నివేదికను కూడా ఆయన సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగంపై శాసనసభ, మండలిలో ధన్యవాదాలు తెలిపే తీర్మానం పెడతారు. ఎమ్మెల్యే బాలు నాయక్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దీనిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరుస్తారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తీర్మానం ప్రవేశపెడితే.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దాన్ని బలపరుస్తారు.