రాష్ట్ర ప్రభుత్వం నివేదన
విచారణ ముగించిన హైకోర్టు
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): క్వార్ట్ తవ్వకాల వల్ల క్షయ వ్యాధి సోకి మరణించిన 187 మంది కార్మికుల కుటుంబాలను చట్ట ప్రకారం ఆదుకొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మృతుల కుటుంబాలకు రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు పరిహారం చెల్లించినట్టు వివరించింది. రంగారెడ్డి జిల్లాలోని లాపల్లి, ఎలట్ట గ్రామాల్లోని క్వార్ట్ గనుల్లో తవ్వకాల వల్ల కార్మికులు మరణించారంటూ 2019లో ఒక ఆంగ్ల పత్రికల్లో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా ప్రజాహిత వ్యాజ్యంగా స్వీకరించి విచారించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సూరేపల్లి నందాతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కార్మికులు చనిపోయిన ఘటనపై రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కమిటీ వేయగా, 2020 మార్చి 31న నివేదిక ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కమిటీ సూచనల మేరకు 187 మంది మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించిందని వివరించారు. ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన ధర్మాసనం పిల్పై విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించింది.