హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి పెరుగుతున్నా థర్డ్ వేవ్పై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. థర్డ్ వేవ్ను ఎదురొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కోటి హోం ఐసొలేషన్ కిట్లు, రెండు కోట్ల కరోనా నిర్ధారణ కిట్లను ఇప్పటికే రాష్ట్రంలోని పీహెచ్సీలు, సబ్సెంటర్లకు సరఫరా చేసినట్టు తెలిపారు. శుక్రవారం ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుతో కలిసి అన్ని జిల్లాల వైద్యాధికారులు, పీవోలు, ఆశ కార్యకర్తలతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండో డోస్ వ్యాక్సిన్ లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని, 15 నుంచి 18 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. సంక్రాంతి సెలవుల్లో ఇండ్లకు వచ్చే విద్యార్థులకు టీకాలు వేయించాలని సూచించారు. ఈ నెల 10 నుంచి 60 ఏండ్లకు పైబడిన, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్ డోస్ ఇవ్వాలని అన్నారు. ఎవరిలో లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహించాలని, హోం ఐసొలేషన్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజూ ఆశ కార్యకర్తలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
అవసరమైతే సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించి, చికిత్స అందించాలని సూచించారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి అప్పుల పాలుకాకుండా ప్రజలను చైతన్య పరచాలని కోరారు. అవసరమైతే, ప్రజాప్రతినిధుల సహకారంతో స్థానికంగానే ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. అన్ని దవాఖానల్లో ఓపీ, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులకు సేవలు అందించడంలో అంతరాయాలు కలగకుండా జిల్లా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో వైద్యారోగ్య శాఖ ఎంతో కృషి చేసి, ప్రజల ప్రాణాలను కాపాడిందని, ఆరోగ్య సూచీలో దేశంలోనే తెలంగాణ మూడో స్థానంలో నిలవడంలో అందరి కృషి ఉన్నదని ప్రశంసించారు. వచ్చే రెండేండ్లలో ఆరోగ్య సూచీలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వానికి ఆశ కార్యకర్తల ధన్యవాదాలు
గత ప్రభుత్వాల హయాంలో పారితోషకం పెంపు కోసం ఆశ కార్యకర్తలు ధర్నాలు చేస్తే, లాఠీచార్జిలు, గుర్రాలతో తొక్కించిన సందర్భాలున్నాయని మంత్రి హరీశ్రావు గుర్తు చేశారు. ఆశ కార్యకర్తల సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మరోసారి 30 శాతం పారితోషకం పెంచారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సంక్రాంతి పండుగకు తీపి కబురు చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు రుణపడి ఉంటామని ఆశ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ప్రోత్సాహంతో మరింత బాగా పనిచేస్తామని పేర్కొన్నారు.
కొత్తగా 2,295 మందికి కరోనా:
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. శుక్రవారం కొత్తగా 2,295 కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేలకు చేరుకున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 1,500 కేసులు వెలుగు చూశాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో 232, రంగారెడ్డిలో 218, హనుమకొండలో 54, సంగారెడ్డిలో 50 కేసులు వెలుగు చూశాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ప్రతి 10 లక్షల జనాభాకు ఇప్పటివరకు 8.04 లక్షల పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు తెలిపారు. వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐదుగురు విద్యార్థ్ధులు, ఇద్దరు ఫ్యాకల్టీకి కరోనా నిర్ధారణ అయ్యింది. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన వైద్యుడు కూడా కరోనా బారినపడ్డారు.