హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): పోక్సో, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచడంతోపాటు ప్రతి కేసు దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశించారు. పెండింగ్ కేసులపై జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో డీజీపీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ ఆఫీస్లోని ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ సెంటర్లో అధికారులు 24×7 అందుబాటులో ఉంటారని తెలిపారు. కేసుల్లో శిక్షల శాతం పెంచడానికి పోలీస్ అధికారులు సిబ్బంది తరచుగా మెజిస్ట్రేట్లను, జడ్జీలను కలవాలని సూచించారు. కేసుల్లో నేరస్థులకు శిక్ష పడితే క్రైంరేట్ తగ్గుతుందని, నేరస్థులకు శిక్షలు పడేలా అన్ని కోణాల్లో కేసుల పరిశోధన ఉండాలని సూచించారు.
తద్వారా ప్రజల్లో డిపార్ట్మెంట్కు మంచి పేరు రావడంతోపాటు నేరాలు తగ్గుతాయని అన్నారు. డిపార్ట్మెంట్కు సంబంధించిన (ఓఈ) ఓరల్ ఎంక్వయిరీలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గంజాయి రవాణా చేసే, విక్రయించే వ్యక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ కేసులు నమోదు చేసి సమూలంగా నిర్మూలించాలని చెప్పారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి రివార్డులు, అవార్డులు అందజేస్తామని స్పష్టంచేశారు. హెచ్ఆర్ఎంఎస్ మాడ్యూల్లో ఉన్న అన్ని అంశాలను అధికారులు, సిబ్బంది వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై నిఘా పెంచాలని తెలిపారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి: పోలీస్ అధికారుల సంఘం
కానిస్టేబుళ్లు, హెడ్కానిస్టేబుళ్ల పదోన్నతులు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ సహా పలు అంశాలను తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు డీజీపీ ఎం మహేందర్రెడ్డి, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి నేతృత్వంలో పాల్గొన్న సంఘం ప్రతినిధులు మొత్తం 12 అంశాలను అధికారుల దృష్టికి తెచ్చారు. వీటిలో ప్రధానంగా పెండింగ్లో ఉన్న సరెండర్లు, టీఏల జారీ, శిక్షణ పూర్తిచేసిన ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం జోన్లలో 1995 బ్యాచ్ హెడ్కానిస్టేబుళ్లకు పదోన్నతుల కల్పన, ఎస్సై ర్యాంకు పదోన్నతుల కోటా 30 నుంచి 50 శాతానికి పెంపు, ఏఆర్లో పనిచేస్తున్న హెడ్కానిస్టేబుల్, ఏఆర్ఎస్సై, ఆర్ఎస్సైల పదోన్నతులు సహా మొత్తం 12 అంశాలపై అధికారులు, సంఘాల నాయకులు చర్చించారు. తాము చెప్పిన అన్ని అంశాలపై డీజీపీ మహేందర్రెడ్డి, ఇతర అధికారులు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే అన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి తెలిపారు. సమావేశంలో అడిషనల్ డీజీలు శివధర్రెడ్డి, విజయ్కుమార్, నాగిరెడ్డి, ఐజీ కమల్హాసన్రెడ్డితోపాటు ఏఓ అకౌంట్స్ అండ్ స్టాఫ్, వెల్ఫేర్ లైజాన్ ఆఫీసర్ కె శ్రీనివాసరెడ్డి, నాయకులు ఎన్ శంకర్రెడ్డి, షకీల్, వెంకటేశ్వర్లు, విరాసత్ అలీ, వీరశంకర్రెడ్డి, అశోక్, కృష్ణారెడ్డి, కృష్ణ, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.