హైదరాబాద్ సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): పేర్లు మార్చుకొని హాంకాంగ్ కేంద్రంగా కొనసాగుతున్న క్యూనెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ బాగోతాన్ని పోలీసులు గుట్టు రట్టుచేశారు. మంగళవారం బంజారాహిల్స్లో పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. దందాలో రాజేశ్ఖ న్నా, ఉపేందర్రెడ్డి, శివనాగ మల్లయ్య, కట కం మల్లేశ్, నాగమణి సహా 12 మంది కీలకమని వివరించారు.
ఈ దందాపై నమోదైన 3కేసులను దర్యాప్తు చేసిన ఏసీపీ అశోక్కుమార్ బృందం 159 మంది బాధితులు రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు గుర్తించిందని పేర్కొన్నారు. క్యూనెట్ ప్రధాన సూత్రధారి దుబాయ్లో ఉన్నాడని, అరెస్టుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
రాజేశ్ ఖన్నా ఆస్తులను విక్రయించి ప్రజలకు న్యాయం చేస్తామని వెల్లడించారు. మరో ఘటనలో ఈ-స్టోర్ సూపర్మార్కెట్ ముసుగులో 44 మందిని మోసగించిన మనీశ్, సయ్యద్ అజ్మల్ను అరెస్ట్చేశామని తెలిపారు. రెండు ఘటనల్లో 35 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి రూ.54 కోట్లను ఫ్రీజ్ చేశామని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బందికి రివార్డులు అందించి ప్రశంసించారు.