తెలంగాణ బిడ్డకు అరుదైన గౌరవం
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): భారత మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావుకు తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. భావితరాలు ఆయన్ని గుర్తుంచుకునేలా రాష్ట్ర శాసనసభలో ఎమ్మెల్యేలు కూర్చునే లాంజ్లో పీవీ తైలవర్ణ చిత్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు 200 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఉండే రంగులను ఉపయోగించడం, జీవం ఉట్టిపడేలా చిత్రపటాన్ని రూపొందించడం గమనార్హం. శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి మీటనొక్కి పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, పీవీ శత జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కేశవరావు, పీవీ కుమారుడు ప్రభాకర్రావు, కుమార్తెలు శారదాదేవీ, ఎమ్మెల్సీ వాణిదేవీ, మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్రెడ్డి, గణేశ్ బిగాల, భట్టి విక్రమార్క, అధికార, ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, పీవీ కుటుంబ సభ్యులు అజిత, డాక్టర్ మాధవి, శేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.