హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ)/బేగంపేట: దివంగత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు తన చాణక్యంతో, ఆలోచనాశక్తితో అభివృద్ధి పథాన నిలిపిన గొప్ప వ్యక్తి అని గుర్తుచేసుకొన్నారు. పీవీ 18వ వర్ధంతి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్రోడ్డులోని పీవీ సమాధి జ్ఞానభూమి వద్ద రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరిగింది. సమాధి వద్ద పలువురు మంత్రులు, పీవీ కుటుంబసభ్యులు పుష్పాంజలి ఘటించారు. సర్వమత ప్రార్థనలు, పీవీ ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే పీవీకి భారతరత్న ప్రకటించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
17 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు పీవీ అని కొనియాడారు. ప్రధానిగా ఆయన చేసిన సంస్కరణలతో దేశం అభివృద్ధి పథంలో కొనసాగుతున్నదని చెప్పారు. ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా అంచలంచెలు ఎదిగి ప్రధాని పగ్గాలు చేపట్టి సమర్థవంతమైన పాలన అందించారని గుర్తు చేశారు. దేశానికి, రాష్ట్రానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఏడాదిపాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందని పేర్కొన్నారు. అంతేకాకుండా 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని హుసేన్సాగర్ తీరాన ఏర్పాటు చేసి నెక్లెస్రోడ్డుకు పీవీ మార్గ్ అని నామకరణం చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి రచించిన ‘నిజాం రాష్ట్రంలో మహాత్ముని పర్యటనలు-హైదరాబాద్లో రాజకీయ సభలు, భాగ్యనగర్ రేడియో’ పుస్తకాన్ని మంత్రి ఆవిషరించారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.
నివాళులర్పించిన గవర్నర్
పీవీ వర్ధంతి సందర్భంగా జ్ఞానభూమి వద్ద గవర్నర్ తమిళిసై నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్, కేవీపీ రామచంద్రరావు, వీ హనుమంతరావు, పొన్నం ప్రభాకర్, అంజన్కుమార్యాదవ్ తదితరులు పీవీకి అంజలి ఘటించారు.