పీవీ స్పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణ
మాజీ ప్రధాని జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళి
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంసరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొనియాడారు. భారత మాజీ ప్రధాని పీవీ జయంతి (జూన్ 28) సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఒక ప్రకటనలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంసరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా, అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందని అన్నారు.
దేశ ప్రధానిగా వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచిన పీవీ స్ఫూర్తి, తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణలో ఇమిడి ఉన్నదని తెలిపారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికి దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం తెలిపారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్పూర్తితో ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.