ఖమ్మం, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ బెదిరింపు రాజకీయాలకు తెలంగాణ లొంగదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జేవీఆర్ కళాశాలలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అధ్యక్షతన శుక్రవారం రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రకు అభినందన సభ జరిగింది. సత్తుపల్లిలోజరిగిన బహిరంగ సభలో మంత్రి అజయ్ మాట్లాడుతూ.. కేంద్రం వివిధ కీలక సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ అరాచకానికి పాల్పడుతున్నదని విమర్శించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసి, ప్రతి రాజకీయ నేతను లొంగదీసుకునే ప్రక్రియకు తెర తీసిందని దుయ్యబట్టారు.
లొంగకపోతే ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను శాఖ అధికారులతో దాడులు చేయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని దుయ్యబట్టారు. రాష్ర్టానికి కేంద్రం ఏమాత్రం సహకరించకపోయినా.. నిధులు ఇవ్వకపోయినా, సీఎం కేసీఆర్ ఓర్పుతో, నేర్పుతో రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నాయకుల కలలు కల్లలు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు నేతలకు రాజ్యసభకు అవకాశం ఇవ్వడం, జిల్లాపై సీఎం ఉన్న అమితమైన ప్రేమకు నిదర్శనమని చెప్పారు.
తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ విజయదుందుభి మోగిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ సమగ్రంగా అభివృద్ధి చెందే వరకు కేసీఆర్ను సీఎంగా ఎన్నుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలపై ఉన్నదని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో జిల్లాకు ఒకేసారి రెండు రాజ్యసభ పదవులు రావడం జిల్లా ప్రజల అదృష్టమని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్రంలో రైతుబంధు పథకం ఆగదని, కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం రైతుబంధు కొనసాగుతుందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. సభలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్రెడ్డి, రాములు నాయక్, మెచ్చా నాగేశ్వర్రావు, హరిప్రియానాయక్, భద్రాద్రి, ఖమ్మం జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్రాజ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.