TSPSC | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ప్రక్షాళన ప్రారంభమైంది. కమిషన్లో అంతర్గత బదిలీలకు రంగం సిద్ధమైంది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి కలిసి ప్రశ్నపత్రాలను లీక్ చేసినట్టు తేలడంతో కొత్త సంస్కరణలకు కమిషన్ శ్రీకారం చుట్టిం ది. సిబ్బంది తక్కువగా ఉండటం, పనిభారం ఎక్కువ కావడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే.. బదిలీలు చేయాలని కమిషన్ భావిస్తున్నది. ఉద్యోగుల పనితీరు, వ్యక్తిత్వం తదితర అంశాలను పరిశీలనలోకి తీసుకుంటున్నది. కొత్తగా అప్పగించబోయే బాధ్యతలు, తక్కువ సమయంలోనే ఆ పనిలో ప్రావీ ణ్యం సాధించేందుకు ఏం చేయాలి? వంటి అంశాలపై కమిషన్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నది. టీఎస్పీఎస్సీలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే కొందరు ఉద్యోగులకు ప్రతి మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి అంతర్గతంగానే బదిలీ చేస్తే ఎలా ఉంటుంది? అనే అంశంపైనా చర్చిస్తున్నది. నేడో, రేపో అంతర్గత బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
టీఎస్పీఎస్సీలో డాటా రక్షణ వ్యవస్థపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో ఉన్నదానికంటే మరింత పటిష్టమైన వ్యవస్థను తీసుకురావాలని భావిస్తున్నది. దీనికోసం సైబర్ సెక్యూరిటీ నిపుణులతో చర్చిస్తున్నది. కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్వాల్ తదితర అంశాలను ప్రత్యేకంగా పర్యవేక్షించే చర్యలపై దృష్టి సారిస్తున్నది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో మరింత పకడ్బందీగా సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నది. సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్వర్డ్స్, యూజర్ ఐడీల భద్రత తదితర అంశాలపై సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నది. టీఎస్పీఎస్సీలో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భావిస్తున్నది. కార్యాలయంలో ఉద్యోగుల పనితీరు? ఉద్యోగులను కలవడానికి ఎవరైనా వస్తున్నారా? తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నది. కార్యాలయంలోని కంప్యూటర్లకు అసలు పెన్డ్రైవ్ యాక్సెస్ లేకుండా చేయడం, ప్రింటింగ్కు సంబంధించి కొన్ని ప్రత్యేక ప్రదేశాలకే పరిమితం చేయడం వంటి అంశాలను పరిశీలిస్తున్నది. భవిష్యత్తులో సంస్థ ఉద్యోగులెవరూ తప్పుచేయకుండా, కంప్యూటర్లు హ్యాకింగ్కు గురయ్యే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నది.
దేశంలోనే టీఎస్పీఎస్సీలో ఎన్నో కొత్త కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు. అతితక్కువ మందితో అత్యల్ప సమయంలో అత్యధిక నోటిఫికేషన్లు ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సగటున ఏడాదికి రెండు నుంచి మూడు వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయగా, టీఎస్పీఎస్సీ ఏర్పడిన తర్వాత అనతికాలంలోనే 35 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా 17,136 ఉద్యోగాల భర్తీ కోసం 26 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ హ్యాకింగ్కు గురికావాల్సి వచ్చింది. అందుకే.. ఉద్యోగులకు ప్రత్యేక సైబర్ శిక్షణ ఇచ్చేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. కార్యాలయ ఉద్యోగులకు సైబర్ భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఉద్యోగులకు సైబర్ భద్రత, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో కంప్యూటర్లు హ్యాక్ కాకుండా ఎలా వ్యవహరించాలి? కఠినమైన పాస్వర్డ్స్ను ఎలా పెట్టుకోవాలి? తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. దీనికోసం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ను రంగంలోకి దింపారు. ప్రతిరోజు విధులకు ఆటంకం కలగకుండానే ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.