హైదరాబాద్ : వరి కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయం నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 3,028 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
సంచికి 40 కిలోల 700 గ్రాముల ధాన్యం మాత్రమే తూకం వెయ్యాలన్నారు. తూకాల వద్ద పకడ్బందీగా వ్యవహరించి రైతులకు ఎలాంటి నష్టం రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నాణ్యతతో ధాన్యం తెచ్చిన రైతులను అభినందించి ప్రోత్సహించాలని సూచించారు.
వ్యవసాయం ఉన్నన్ని రోజులు రైతులకు ఏదో ఒక సమస్య ఉంటుందని..రాష్ట్రంలోని సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి అధ్యక్షులు ప్రతిరోజూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకోవాలన్నారు.
అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు తమ వద్ద ఉన్న టార్పాలిన్లు ధాన్యం కొనుగోలుకేంద్రాలకు తెచ్చుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ నిబంధనలతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించాలని, ప్రజాప్రతినిధులు నిబంధనలు రైతులకు అర్థమయ్యేలా వివరించాలని నిరంజన్ రెడ్డి కోరారు.
వరి కోతలు పూర్తయిన తర్వాత రైతులు పొలాలలో గడ్డిని కాల్చవద్దన్నారు. అధికారులు రైతులను ఈ విషయంలో చైతన్యపర్చాలన్నారు. వానాకాలం సాగులో పత్తి, కంది సాగుతో పాటు సన్నవడ్ల సాగును పెంచాలన్నారు. ఇప్పటి నుండే ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని అధికారులకు సూచించారు.
ఉపాధిహామీ కింద అన్ని గ్రామాలలో కాల్వల పూడికతీత పనులు వందశాతం పూర్తికావాలన్నారు. ఏ కారణం చేతనైనా పూడికతీత పనులు చేపట్టకపోయినా సంబంధిత సర్పంచ్, కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
తూతూమంత్రంగా పనులుచేసినా, పనులు చేపట్టకపోయినా సర్పంచ్, కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు