హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): డెంగీ చికిత్స కోసం ‘సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్’ (ఎస్డీపీ) యంత్రాలు కొనుగోలు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రూ.10 కోట్లతో వెంటనే 32 ఎస్డీపీలను కొనుగోలు చేసి, అన్ని జిల్లా దవాఖానల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. బుధవారం సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు నమోదయ్యే అవకాశం ఉందని, తక్షణ పరీక్షలు, వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితిని 57 ఏండ్ల నుంచి 64 ఏండ్లకు పెంచాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు హైకోర్టు ఆదేశాలకు లోబడి వారికి శిక్షణ ఇచ్చే అంశంపై పూర్తి నివేదిక రూపొందించేలా కమిటీని ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదిక అందించాలన్నారు. కొత్తగా సమకూర్చుకొన్న 228 అమ్మఒడి వాహనాలు, 204 ‘108’ వాహనాలు, 34 హర్సే వాహనాలను ఆగస్టు 1న ప్రారంభించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. టీచింగ్ దవాఖానల్లో 190 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రొఫెసర్ల బదిలీల ప్రతిపాదనలు పంపాలని డీఎంఈ రమేశ్రెడ్డిని ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లోని (టీవీవీపీ) 112 డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ సర్జన్ పదోన్నతుల ప్రక్రియ వెంటనే చేపట్టి, 15 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. టీవీవీపీలోని 371 నర్స్ ప్రమోషన్ల ప్రక్రియతోపాటు, పది రోజుల్లో లోకలైజేషన్, నెల రోజుల్లో ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేయాలి పేర్కొన్నారు. ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫర్స్ పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. సమీక్షలో ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఎస్డీపీలతో ఎన్నో ప్రయోజనాలు
డెంగీ చికిత్స కోసం సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మెషీన్లను వినియోగించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. దాత నుంచి సేకరించిన రక్తంలోని ప్లేట్లెట్లను ఈ మెషీన్ ద్వారా వేరే చేస్తారు. ఒక దాత నుంచి 6-8 సైకిల్స్లో ప్లేట్లెట్లను సేకరిస్తారు. ఇందుకు గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ప్రస్తుతం ‘ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్’ విధానంలో సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎర్ర రక్తకణాలు వృథా అవడంతోపాటు తక్కువ ప్లేట్లెట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ర్యాండమ్ డోనర్ మెషీన్ల ద్వారా 6-8 యూనిట్లలో సేకరించే ప్లేట్లెట్లను సింగిల్ డోనర్ మెషీన్ల ద్వారా ఒకే యూనిట్లో సేకరించవచ్చు. సింగిల్ డోనర్ మెషీన్ల ద్వారా సేకరించే ప్లేట్లెట్లను రక్తవర్గంతో సంబంధం లేకుండా ఏ రోగికైనా ఎక్కించవచ్చు.