పంజాబ్ ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంస
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/శంషాబాద్ రూరల్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ, ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని పంజాబ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ప్రశంసించింది. ‘ధరణి’పై అధ్యయనం చేసేందుకు వచ్చిన ఈ బృందం బుధవారం శంషాబాద్ మండల రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించింది. అక్కడ ధరణి ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించింది. అనంతరం హైదరాబాద్లోని వల్లభ నగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల గురించి తెలుసుకొన్నది. ధరణి పోర్టల్ను చూసి అబ్బురపడింది. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు ఎంతో ముందుచూపుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్నదని కొనియాడింది. అంతకుముందు ఈ బృందం మీ-సేవ కమిషనర్, టీఎస్టీఎస్ ఎండీ జీటీ వెంకటేశ్వరరావుతో పాటు రంగారెడ్డి కలెక్టర్ అమోయ్కుమార్, అడిషనల్ కలెక్టర్ ప్రదీప్ జైన్, డీఆర్వో హరిప్రియ, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ సుభాషిణి తదితరులను కలిసింది.
రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన తీరును వెంకటేశ్వరరావు ఆ బృందానికి వివరించారు. భూ రికార్డులను ప్రజల ముందు పెట్టి వారి ఆమోదంతో నవీకరించామన్నారు. ఈ రికార్డుల ఆధారంగా రైతులకు పూర్తి భద్రతతో కూడిన నూతన పట్టాదార్ పాస్పుస్తకాలు జారీ చేశామని చెప్పారు. ఈ రికార్డులన్నింటినీ ధరణిలో పొందుపరిచి కోర్ బ్యాంకింగ్ విధానంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్లు, ఆ వెంటనే మ్యుటేషన్లు జరిగేలా చూస్తున్నామని తెలిపారు. తద్వారా భూ యజమానులకు పారదర్శకమైన సేవలు అందిస్తూ ఎలాంటి మోసాలు, ట్యాంపరింగ్లకు అవకాశం లేకుండా చేశామన్నారు. దీంతో ధరణి అద్భుతమైన భూ రికార్డుల వ్యవస్థగా మారిందని తెలిపారు. ఈ బృందంలో పంజాబ్ రెవెన్యూ శాఖ కార్యదర్శి మాన్వేష్ సింగ్ సిద్ధూ, రెవెన్యూ కమిషన్ మాజీ సభ్యులు, సలహాదారులు, జిల్లా రెవెన్యూ అధికారులు నరీందర్ సింగ్ సంఘా, ప్రదీప్ సింగ్ బెయిన్స్ ఉన్నారు.