Bhagwant Mann | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై దొడ్డిదారిన ఆధిపత్యం చెలాయించటమే పాలన అని ప్ర ధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్సింగ్మాన్ మండిపడ్డారు. పంజాబ్లో ప్రజలు తమకు సంపూర్ణ అధికారం ఇవ్వటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నదని, అందుకే గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నివాసాలైన రాజ్భవన్లను బీజేపీ కార్యాలయాలుగా కేంద్రం మార్చిందని దుయ్యబట్టారు. శనివారం ప్రగతిభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
‘పంజాబ్లో మేం 92 సీట్ల భారీ మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఇంత భారీ మెజారిటీతో ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం గత మార్చిలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఈ పరిస్థితిని సృష్టించింది మోదీ సర్కారే’ అని వివరించారు. గవర్నర్ వ్యవస్థను అడ్టుపెట్టుకొని కేంద్రం బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై ఆధిపత్యం చేస్తున్నదని విమర్శించారు. పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, తెలంగాణ తదితర రాష్ర్టాల్లో గవర్నర్లు బీజేపీ నేతలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సాధారణ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేప ట్టే అవకాశం రాకపోతే రకరకాల మార్గాల ద్వారా ఉప ఎన్నికలను తెప్పించి అధికారంలోకి రావాలనే కుట్రలో భాగంగానే కేంద్రం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నదని భగవంత్మాన్ ఆరోపించారు.
రైతు కుటుంబాల్లో కేసీఆర్ వెలుగులు
రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపారని పంజాబ్ సీఎం కొనియాడా రు. చండీగఢ్ వచ్చి తమ రాష్ట్ర రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రైతు సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను తెలుసుకొన్నానని పేర్కొన్నారు. తెలంగాణ స్ఫూర్తితో పంజాబ్లో చెక్డ్యామ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.