హైదరాబాద్ : అబద్దాల యూనివర్సిటీకి వైస్ ఛాన్స్లర్గా మోదీ వ్యవహరిస్తున్నారని పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ తొండి సంజయ్గా మారారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ డీ గ్యాంగ్గా మారారని ఆరోపించారు. వారిని దోపిడీ దొంగలు, డెకాయిట్, డ్రగ్స్ గ్యాంగ్గా అభివర్ణించారు.
టీఆర్ఎస్ తరఫున తాము వేసిన వంద ప్రశ్నలపై నోరు విప్పాలని సమాధానం చెప్పాలని పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వంద ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే తెలంగాణ ప్రజలు బీజేపీని బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు. ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం ఏ వర్గానికి మేలు చేసిందో చెప్పాలని నిలదీశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మోదీ వ్యవహారాలపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధాన్ని మోదీ ఆపారంటూ బండి సంజయ్ చేసిన ప్రకటన హాస్యాస్పదంగా ఉందని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ హక్కులను పరిరక్షించలేని దద్దమ్మలు బీజేపీ ఎంపీలని ఆయన మండిపడ్డారు.
గ్యాస్ ధరలకు సమాధానమేది?
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై గొంతు చించుకున్నారని.. రాహుల్ గాంధీకి చీరెలు, గాజులు పంపారని గుర్తు చేశారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి దేశ మహిళలపై గుదిబండగా మార్చిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. గ్యాస్ ధర రూ.1105కు చేర్చిన పాపానికి మహిళలు వ్యక్తం చేసే ఆగ్రహంలో మాడి మసైపోతుందని పేర్కొన్నారు.
వసూళ్ల బండీ..
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బండి సంజయ్ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని త్వరలోనే ఆ జాబితా విడుదల చేస్తామని జీవన్ రెడ్డి చెప్పారు. అబద్ధాల బీజేపీ గ్యాంగ్ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయన్నారు. నిజామాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగితే కేంద్ర ఇంటిలిజెన్స్ ఏం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పారు.
కేసీఆర్ పాలన స్వర్ణయుగం
సీఎం కేసీఆర్ పాలన తెరచిన పుస్తకమని జీవన్రెడ్డి కొనియాడారు. రాష్ట్రానికి కేసీఆర్ హయాం స్వర్ణయుగమని అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, దళితబంధు, కల్యాణలక్షి, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. రైల్ ఇంజిన్లు అమ్ముకునే బీజేపీ డబుల్ ఇంజిన్ తమకొద్దూ అని దేశ ప్రజలు నినదిస్తున్నారని ఆయన చెప్పారు. దేశానికి ప్రధానిగా కేసీఆర్ కావడం ఖాయమని, దాన్ని ఎవరూ ఆపలేరని ఆయన పేర్కొన్నారు.