ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మున్నెన్నడూ జరగలేదని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జరిగిన అభివృద్ధిపై ఎంపీ అరవింద్ చర్చకు సిద్ధమా అంటూ బహిరంగ సవాల్ విసిరారు. గురువారం ఆర్మూర్ పట్టణంలో “నమస్తే నవనాథపురం” కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొని, అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్మూర్లో రూ.2 వందల కోట్లతో కొత్త అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పట్టణంలో రూ. 50 కోట్లతో రోడ్లు వేశామన్నారు. మరో రూ. 23.70 కోట్లతో త్వరలోనే మిగిలిన రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. ‘ ఆర్మూర్ గతంలో ఎట్లుంది? ఇప్పుడెట్లుంది? స్వాతంత్రం వచ్చాక ఎప్పుడైనా ఇంత అభివృద్ధి జరిగిందా’ ? అని ప్రశ్నించారు. ఆర్టీసీ బైపాస్ రోడ్డు, సిద్ధులగుట్టకు ఘాట్ రోడ్డు, టూరిజం స్పాట్ గా గుండ్లచెరువు, నిజామాబాద్-ఆర్మూర్, నందిపేట్-ఆర్మూర్ రోడ్లు, అర్బన్ పార్క్ వంటి అభివృద్ధి పనుల గురించి కన్నారా?, విన్నారా? అని పేర్కొన్నారు.
‘ అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని ఉన్నట్లు’ బీజేపీ నాయకులు దాపురించారని ఆరోపించారు. ‘ఎంపీ అరవింద్ కేసీఆర్ కుటుంబాన్ని తిడితే పెద్దోడినయి పోతాననే భ్రమలో ఉన్నాడని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శించే వారు హీరోలు కాదు జీరోలని అన్నారు. తమది ఫైటర్స్ ఫ్యామిలీ. అరవింద్ ది ఛీటర్స్ ఫ్యామిలీ అని ఎద్దేవా చేశారు. ‘పసుపు బోర్డ్ సాధించనందుకు ముక్కు నేలకు రాయి. రాజీనామా చేసి రైతుల కాళ్ళు పట్టుకో’వాలని అరవింద్కు సూచించారు.
వచ్చే ఎన్నికల్లో అరవింద్కు డిపాజిట్ కూడా రాదని, ఆయన ఎక్కడ పోటీచేసినా ఓడగొట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆర్మూర్ మునిసిపల్ చైర్ పర్సన్ పండిత్ వినిత పవన్, వైస్ చైర్మన్ మున్ను , వివిధ వార్డుల కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.