హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి పదవికి విలువ ఇవ్వకుండా, అసహనంతో బూతులు తిడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నాలుక తెగ్గోస్తామని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. రేవంత్రెడ్డి అవగాహనారాహిత్యంతో మాట్లాడితే రైతులే రాళ్లతో కొట్టిచంపుతారని చెప్పారు. తెలంగాణ జాతిపిత సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డినే ప్రజలు ఏకే 57తో కాల్చేస్తారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పేర్కొన్నారు. బుధవారం టీఆర్ఎస్ ఎల్పీలో పల్లా రాజేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా రేవంత్ అడిగిన ప్రశ్నకే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారని గుర్తుచేశారు. మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణలో 2014 నుంచి రైతు ఆత్మహత్యలు తగ్గాయని ఎన్సీఆర్బీ వెల్లడిస్తే, రేవంత్ అనే వెధవ రాష్ట్రంలో 8,011 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్న సంగతిని విస్మరించి, రాష్ట్రంపై విషం చిమ్ముతున్న రేవంత్ నాలుక తెగ్గోస్తామని హెచ్చరించారు. ఆత్మహత్యలకు, ఇతర మరణాలకు తేడా తెలియని లుచ్చా రేవంత్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు డబ్బుతో పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కొన్న రేవంత్.. కాంగ్రెస్ను బీజేపీకి తాకట్టుపెట్టడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశంలోనే తెలంగాణ రైతులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తుచేశారు. లక్ష రూపాయల కోసం రైతులు తిన్నదరగక చస్తున్నారని కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానించి అవమాన పరిచారని ఆరోపించారు. ముందుగా ఆత్మహత్య చేసుకొన్న కుటుంబాలకు రేవంత్ క్షమాపణ చెప్పి, వాళ్ల కాళ్లుకడిగి నీళ్లునెత్తిపై చల్లుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హామీని నమ్మలే
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టి రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పల్లా చెప్పారు. ఏ కారణంతో రైతు మరణించినా రూ.5 లక్షల బీమా చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు 74 వేల కుటుంబాలకు రైతుబీమా ద్వారా భరోసా దక్కిందని వెల్లడించారు. 2014, 2018 ఎన్నికల్లో రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించినా కాంగ్రెస్ను రైతాంగం నమ్మలేదని, సీఎం కేసీఆర్ను నమ్మి రెండుసార్లు అధికారం కట్టబెట్టారని, వచ్చే ఎన్నికల్లో ఇదే పునరావృతం అవుతుందని చెప్పారు. రైతు సం క్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్ను ఇష్టమొచ్చినట్టు తిడితే, రైతులు రేవంత్ను రాళ్లతో కొట్టి చంపుతారని హెచ్చరించారు. చెత్త మాటలు మాట్లాడితే తరిమితరిమి కొడతారని చెప్పారు. సభ్యత.. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే నాలిక తెగ్గోస్తామని హెచ్చరించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ చంద్రబాబు హయాంలోనే మూసేశారని, వైఎస్ హయాంలో సభాసంఘం వేసినా తెరవలేకపోయారనే విషయం తెలుసుకోలేని చవట నోరు మూసుకోవాలని సూచించారు.
రేవంత్ను మించిన బ్రోకర్ ఎవరూ లేరు: ఎమ్మెల్యే అరూరి
గాంధేయమార్గంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అనతికాలంలోనే దేశం గర్వించదగ్గ పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్కు ఏకే 57తో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి రైఫిల్రెడ్డిగా మారిన చరిత్రను తెలంగాణ సమాజం మరచిపోదని గుర్తుచేశారు. రేవంత్ ఎక్కడున్నా చంద్రబాబు ఏజెంటేనని, ఇటీవల వరంగల్ సభకూ చంద్రబాబే డబ్బు పంపారని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ను మించిన బ్రోకర్ ఎవరూ లేరని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎంతలేపినా లేవదని అన్నారు. రాహుల్గాంధీ, కాంగ్రెస్ని నమ్ముకొంటే జీవితం సర్వనాశనమవుతుందనే గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ఆ పార్టీకి రాజీనామా చేశారని చెప్పారు. బ్లాక్మెయిలర్ రేవంత్కు సీఎం కేసీఆర్ కుటుంబంపై మాట్లాడే నైతిక హక్కులేదని, బుట్టాచోర్ రేవంత్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని చెప్పారు.