నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 12: తోబుట్టువుల ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. రక్షాబంధన్ సందర్భంగా సీఎం చిత్రపటాలకు రాఖీలు కట్టాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మహిళలు, వృద్ధులు, చిన్నారులు స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలు, కటౌట్లు, విగ్రహాలకు రాఖీలు కట్టి అభిమానం చాటుకొన్నారు. మహిళల ఆత్మగౌరవం పెంచేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి కృతజ్ఞతలు తెలిపారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ శివారులోని బతుకమ్మ కుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో వృక్షాలకు రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ చైర్మన్ దావ వసంత, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూశర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వృక్షాలకు రాఖీలు కట్టారు. ఖమ్మం జిల్లాకేంద్రానికి చెందిన బొలగాని త్రివేది రాఖీ కట్టిన తన అక్క రణశ్రీకి కానుకగా చిన్నప్పటి నుంచి తను దాచుకున్న రూ.5 నాణేలతో తులాభారం వేశాడు. ఆమె బరువుకు సరిపడా 11,200 రూ.5 నాణేలను కానుకగా ఇచ్చాడు. తమ్ముడి సర్ప్రైజ్ గిఫ్ట్కు రణశ్రీ ఉప్పొంగిపోయారు. హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్లో దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి, మహిళా దివ్యాంగుల సాధికార సంఘం అధ్యక్షురాలు కోల రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో దివ్యాంగులు సీఎం చిత్రపటానికి రాఖీలు కట్టారు.