ఖైరతాబాద్, ఆగస్టు 7: ప్రజా సంబంధాల అంశంపై ఆసక్తి పెరగాల్సిన అవసరం ఉన్నదని, అకాడమిక్లో ఈ సబ్జెక్టు విద్యార్థులకు బహుళ ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు. ప్రజా సంబంధాలు అనేవి మానవ సమాజంలో చాలా ముఖ్యమని అన్నారు. ఐఎంపీఆర్ మాజీ కమిషనర్ దివంగత డాక్టర్ సీవీ నరసింహారెడ్డి జయంతి సందర్భంగా పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్, సీవీఎన్ పబ్లిక్ రిలేషన్స్ ఫౌండేషన్ హైదరాబాద్ సంయుక్తాధ్వర్యంలో ఆదివారం లక్డీకాపూల్లోని అశోకా హోటల్లో పబ్లిక్ రిలేషన్స్ ఎడ్యుకేషన్ డే వేడుకలు నిర్వహించారు. ‘పబ్లిక్ ఇన్ఫర్మేషన్-పబ్లిక్ రిలేషన్-ఇండియన్ సినారియో’ అనే అంశంపై నిర్వహించిన సదస్సును తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్లు కట్టా శేఖర్రెడ్డి, సయ్యద్ ఖలీలుల్లా.. పీఆర్ఎస్ఐ సెక్రటరీ జనరల్, పీఆర్ వాయిస్ ఎడిటర్ వై బాబ్జి, జాతీయ ఉపాధ్యక్షుడు (సౌత్) యూఎస్ శర్మ, సీవీఎన్ పీఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ సీ రమాదేవి, హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ డాక్టర్ పీ వేణుగోపాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కట్టా శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. సీవీఎన్ పీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దివంగత నర్సింహారెడ్డి ప్రజా సంబంధాల వ్యవస్థకు పితామహునిగా కీర్తిపొందారని, చివరి శ్వాస వరకు దాని కోసం పునరంకితమయ్యారని కొనియాడారు. పీఆర్ వ్యవస్థకు ఆయన చేసిన సేవలు శ్లాఘనీయమని పేర్కొన్నారు. 2022 సంవత్సరానికి ఉత్తమ పీఆర్ మేనేజర్గా రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (విశాఖపట్నం) కమ్యూనికేషన్ ఇంచార్జి, జనరల్ మేనేజర్ ఆస్పీ శర్మను ఎంపికచేశారు. ఆయనను అతిథులు సత్కరించారు.
యాదగిరికి పీఆర్ఎస్ఐ బెస్ట్ కౌన్సిలర్ అవార్డు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ జర్నలిజం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న కంభంపాటి యాదగిరి పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) బెస్ట్ కౌన్సిలర్ అవార్డు దక్కింది.