మేడ్చల్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో నిరసన సెగ తగిలింది. అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ పలు గ్రామాల ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు చింతలపల్లిలో చేపట్టిన దీక్షకు ప్రజా మద్దతు కరువైంది. రేవంత్కు వ్యతిరేకంగా మంగళవారం మూడు చింతలపల్లి మండలం లాల్గడి మలక్పేట, జగ్గంగూడ, కేశవరం, నాగిశెట్టిపల్లి, పోతారంచౌరస్తా, మూడు చింతలపల్లి గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్షలను చేపట్టారు. ఆయా గ్రామాల ప్రజలు ‘గోబ్యాక్.. గోబ్యాక్’ నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు, ముఖ్యమంత్రి దత్తత గ్రామాలు అభివృద్ధి సాధించిన నేపథ్యంలో ఉమ్మడి శామీర్పేట, మూడు చింతలపల్లి మండలాల్లోని ఏడు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్ర పటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. దత్తత గ్రామాల్లో రూ.69 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు 98 శాతం పూర్తయినట్టు దత్తత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. రేవంత్ చేపట్టిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డుమ్మా కొట్టడంతో ఆయన పట్ల వ్యతిరేకత బహిర్గతమైంది. కాంగ్రెస్లో సఖ్యత లేనట్టు స్పష్టమైంది. ఈ దీక్షకు పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముఖం చాటేశారు.మాజీ మంత్రి షబ్బీర్అలీ, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, మహ్మద్ అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్కుమార్యాదవ్, మహేశ్కుమార్గౌడ్ మినహా మొదటిరోజు దీక్షకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాకపోవడం గమనార్హం. జన సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఒక్కొక్కరికి రూ.300 నుంచి రూ.500ల నగదు, పులిహోరా ప్యాకెట్లు ఆశ జూపినా ఫలితం దక్కలేదు. వక్తలు ప్రసంగిస్తుండగానే సభ నుంచి జనం వెళ్లిపోయారు. రేవంత్రెడ్డి ప్రసంగించే సమయానికే వచ్చినవారు కూడా వెళ్లిపోవడంతో అనేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.