హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తన ప్రాజెక్టుల కోసం 800 అడుగుల నుంచి నీటిని తీసుకుంటున్నదని, తామూ అదే మట్టం నుంచి పంప్ చేసుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతలు కట్టుకుంటే అభ్యంతరం ఏమిటని జగన్ వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. బేసిన్లో ఉండే తెలంగాణ ప్రాజెక్టులను, బేసిన్ ఆవల నిర్మించిన ఏపీ ప్రాజెక్టులను ఒకే గాటన కట్టి వాదించడం సరైన పద్ధతికాదని శుక్రవారం ఒక ప్రటకనలో హితవుపలికారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని తెలంగాణ మొదటి నుంచీ కోరుతున్నదని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా దీనిపై చర్చ జరగగా అందుకు ఏపీ సైతం అంగీకరించిందని, ఇప్పుడు మాట మార్చిందని విమర్శించారు. పక్క రాష్ర్టాలతో సఖ్యతగా ఉండాలని భావిస్తున్న ఏపీ సీఎం జగన్.. తెలంగాణకు చెప్పకుండా ప్రాజెక్టు పనులను ఎలా చేపడతారని ప్రశ్నించారు. గతంలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి చెప్పినదానికి విరుద్ధంగా జగన్ ఇప్పుడు 797 అడుగుల వద్ద పంప్లను బిగించడం పూర్తిగా కుట్రని మండిపడ్డారు. 800 అడుగుల నుంచి నీటిని పంప్ చేస్తామని ఏపీ సీఎం జగన్ అనడం పూర్తిగా న్యాయవిరుద్ధమని ఖండించారు. బేసిన్ అవసరాలను కాదని బేసిన్ ఆవలికి కృష్ణా జలాలను తరలిస్తే అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు.