రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం అమలుకు ప్రత్యేక కార్యాచరణ
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. ఒకసారి వినియోగించి వదిలేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై జూలై 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సంసిద్ధమైందని చెప్పారు. ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే ప్లాస్టిక్ మహమ్మారిపై విజయం సాధించగలమని.. తద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకర వాతావరణాన్ని ఇవ్వగలమని పేర్కొన్నారు. సింగిల్యూజ్ ప్లాస్టిక్ ముడిసరుకులను నియంత్రించడం, ప్లాస్టిక్ డిమాండ్ను తగ్గించడానికి సరియైన చర్యలు తీసుకోవడం, సింగిల్యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ప్రజలను చైతన్యపర్చడంపై ప్రభుత్వం దృష్టిసారించినట్టు ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
సమగ్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) బహుముఖ వ్యూహాన్ని అనుసరించనున్నదని చెప్పారు. ప్రత్యామ్నాయ వస్తువులను ప్రోత్సహించే దిశగా కంపోస్టబుల్ ప్లాస్టిక్ వస్తువుల తయారీకి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వన్టైం సర్టిఫికెట్లను జారీ చేస్తుందని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరతహా పరిశ్రమలకు మద్దతుగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వర్క్షాపులను నిర్వహిస్తుందని, ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ మార్గాలను వీటిలో సూచిస్తారని మంత్రి తెలిపారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ అండ్ టెక్నాలజీ (సీపెట్), జాతీయ ఎంఎస్ఎంఈ శిక్షణ సంస్థ, ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, ఇతర ఇండస్ట్రియల్ అసోసియేషన్ల సహకారంతో ఈ వర్క్షాప్లు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదు చేసేందుకు ‘ఎస్యూ-సీపీసీబీ’ అనే ప్రత్యేక ఆన్లైన్ యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి వెల్లడించారు.