హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): టీచర్లకు పదోన్నతులు కల్పించాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు ముదిరేసి చెన్నయ్య, కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం హైదరాబాద్లోని పీఆర్టీయూ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు అన్నీ పూర్తవుతాయని ఆశించామని, కొందరు స్వార్థం కోసం కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియకు అంతరాయం కలిగిందని తెలిపారు.
బదిలీ విషయమే కోర్టులో ఉన్నదని, ప్రమోషన్లకు అడ్డంకులు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రమోషన్ల విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరులో పీఆర్సీ కమిటీ వేయాలని, పెండింగ్లోని డీఏలు విడుదల చేయాలని, ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారెడ్డి అంజిరెడ్డి, కోశాధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు.