నిజామాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచిన పీఆర్టీయూను సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరిచిపోరు అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో శనివారం నిర్వహించిన పీఆర్టీయూ 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 75 వేల మంది టీచర్లు పీఆర్టీయూ సభ్యత్వం కలిగి ఉన్నారని తెలిపారు. టీచర్ల ప్రయోజనాలు, వారి హక్కుల కోసం పీఆర్టీయూ నిబద్ధతతో పని చేస్తుందని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమంలో పీఆర్టీయూ కీలకపాత్ర పోషించిందని కొనియాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అందించిన సహకారాన్ని సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరిచిపోరు అని స్పష్టం చేశారు. పీఆర్టీయూ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్, రఘోత్తం రెడ్డి, నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్, మాజీ శాసన మండలి సభ్యులు పూల రవీందర్, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, పీఆర్టీయూ నిజామాబాద్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, పీఆర్టీయూ నిజామాబాద్ కార్యదర్శి వెంకటేష్ గౌడ్, పీఆర్టీయూ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి రవి కిరణ్, లేడీ అసిస్టెంట్ సెక్రటరీ రాధా లతా, ఆశా రాణితో పాటు రాష్ట్రం నలుమూలల నుండి వచ్చినటువంటి 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పీఆర్టీయూ ప్రతినిధులు పాల్గొన్నారు.