హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్కు సంబంధించి భూముల లావాదేవీల్లో ఎదురవువుతున్న అడ్డంకులు ఇకపై తొలగిపోనున్నాయి. ధరణి పోర్టల్లో సమస్యలపై చర్చించి, నివేదిక ఇచ్చేందుకు ఆర్థిక మంత్రి హరీశ్రావు సారథ్యంలో మంత్రులు జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ సభ్యులుగా ఉన్న సబ్కమిటీ.. క్రెడాయ్, ట్రెడా, ట్రెసా లాంటి సంస్థలతోపాటు ప్రజలు, ప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులను, వివిధ రకాల అంశాలను పరిశీలించింది. సమస్యలన్నింటినీ సానుకూలంగా పరిష్కరించేలా ధరణి పోర్టల్ మరింత సరళంగా మార్చేలా, ఎలాంటి భూ సమస్యలనైనా పరిష్కరించేలా సబ్కమిటీ పలు సూచనలు చేసింది. సోమవారం నాటి సమావేశంలో ఈ సిఫారసులను మంత్రివర్గానికి సమర్పించిందని సమాచారం.దీనిపై దాదాపు 4గంటలపాటు చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. తప్పుగా నమోదైన పట్టాదార్ పేరు, వివరాలను సరిచేయడంతోపాటు.. పొరపాటున పట్టాభూములు ప్రభుత్వ భూములుగా నమోదవడం, భూమి ఉపయోగంలో/తరగతిలో/వివిధ రకాల భూములకు సంబంధించిన మార్పు చేర్పులు, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం సరిచేయడం, ఒకరికంటే ఎక్కువగా కొనుగోలుదారులు/అమ్మకందారులను అనుమతించడం తదితర అంశాల్లో మాడ్యూళ్లును తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తునట్టు తెలుస్తున్నది.
సబ్ కమిటీ దృష్టికి 20 ప్రధానమైన సమస్యలు వచ్చినట్టు తెలుస్తున్నది. వాటి పరిష్కారానికి సుమారు 7 రకాల మాడ్యూళ్లను అందుబాటులోకి తేవాలని సిఫారసు చేసినట్టు సమాచారం. ఇందులో చాలా తేలికగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనుకొనే రెండు రకాల మాడ్యూళ్లను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తున్నది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వం పరిశీలిస్తున్న, తీసుకోనున్న చర్యలు ఇలా ఉండనున్నాయి..
పట్టాదార్ పేరులో అక్షర దోషాలు లేదా పేరు తప్పుగా నమోదైనట్టు ఫిర్యాదులున్నాయి. ధరణిలో ఇందుకు సంబంధించిన మాడ్యూల్ను పొందుపర్చాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఫిర్యాదులు స్వీకరించేందుకు కొంత సమయం ఇచ్చి తప్పులను ఆన్లైన్లోనే సరిదిద్దే అవకాశాన్ని కలెక్టర్లకు ఇవ్వనున్నారు.
కొన్ని చోట్ల పట్టా భూములు లావుని పట్టాగా నమోదయ్యాయి. కొన్ని చోట్ల భూదాన్/దేవాదాయ భూములుగా కూడా నమోదయ్యాయి. ఈ విభాగంలో మా ర్పు చేర్పులకు పోర్టల్లో మాడ్యూల్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది.
ప్రభుత్వ భూములుగా పొరపాటున పట్టా భూములుగా నమోదైతే.. వాటిని సరిచేసేలా ప్రత్యేక మాడ్యూల్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
పలు సబ్డివిజన్లు, సర్వే నంబర్లు ధరణిలో కనపడటం లేదు. ఈ ఒక్క అంశంపైనే దాదాపు 34,666 ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ల్యాండ్ రికార్డుల అప్గ్రేడేషన్ సమయంలో పట్టాదార్ పాసు పుస్తకాలను ఈ మిస్సింగ్ సబ్ డివిజన్లు, సర్వే నంబర్లకు ఇవ్వలేదు. దీనికోసం ప్రత్యేకంగా మాడ్యూల్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
ప్రస్తుతం ధరణిలో పోర్టల్లో ఒక్క వ్యక్తినే కొనుగోలు/అమ్మకం చేసేందుకు అనుమతిస్తున్నారు. అంతకంటే ఎక్కువ మందిని అనుమతించేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా మాడ్యూల్ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది.
-ప్రస్తుతం భూమి కొనుగోలు చేసే వ్యక్తి తప్పకుండా హాజరు కావాల్సి ఉన్నది. ఎన్ఆర్ఐల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రత్యేక ప్రతినిధిని నియమించుకునేలా స్పెషల్ పవర్ ఆఫ్ ఆటార్నీ (ఎస్పీఏ)ని ఏర్పాటు చేయాలని ఉపసంఘం సూచించింది. ఈ తరహాలో రిజిస్ట్రేషన్ చట్టం అనుమతిస్తుంది. ఇందుకు సంబంధించి సాఫ్ట్వేర్లో తగిన మార్పులు, చేర్పులకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
ఇందుకు సంబంధించి ధరణిలో అవకాశం కల్పించాలని పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్/ప్రొటెక్టెడ్ టెనెంట్స్ సర్టిఫికెట్లను కొత్తగా ఇవ్వాలంటే.. ఒక్కో కేసును ప్రత్యేకంగా పరిశీలించేందుకు, ప్రత్యేకంగా ఒక మాడ్యూల్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం కలెక్టర్ల నుంచి విజ్ఞాపనలను పరిశీలించాలని సూచించింది.
పట్టాదార్ పాస్ పుస్తకాల్లో భూ విస్తీర్ణం తప్పుగా నమోదైనట్టుగా సుమారు 16 వేల వరకు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తున్నది. ఇలాంటి సమస్యలకు డిజిటల్ సర్వే చేయడం ద్వారానే శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.నమోదు చేసేటప్పుడు భూ విస్తీర్ణంలో తేడా వచ్చిన సందర్భాల్లో పాత రికార్డులను పరిశీలించి సరిదిద్దవచ్చు. అవసరమైతే ఫీల్డ్సర్వే చేస్తేనే నిజానిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది. నమోదు సందర్భంగా దొర్లిన తప్పుల (క్లరికల్)ను సరిదిద్దేందుకు ప్రత్యేక మాడ్యూల్ను ధరణి పోర్టల్లో అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు యోచిస్తున్నది. ఒకవేళ చుట్టుపక్కలవారి భూములను కూడా సర్వే చేయాల్సిన అవసరం ఏర్పడితే.. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద 5 జిల్లాల్లో (రంగారెడ్డి, సంగారెడ్డి, నల్లగొండ, నిజమాబాద్, సిద్దిపేట) అమలు చేస్తున్న విధానాన్ని లోతుగా పరిశీలించాల్సి ఉన్నది. తద్వారా మరింత స్పష్టమైన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది.
ధరణిలో భూములకు సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, మార్పు చేర్పులకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుందని, భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలని సబ్ కమిటీ సిఫారసు చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ధరణి హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని, రెవెన్యూ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, జిల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో జిల్లా కలెక్టర్లు ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చైతన్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది.