హైదరాబాద్/సుల్తాన్బజార్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్న టీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయమార్గంపై దృష్టిపెట్టింది. తన సొంత బ్రాండ్ ‘జీవ’ పేరుతో ప్రయాణికులకు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను అందించనుంది. ఈ మేరకు ఎంజీబీఎస్ ప్రాంగణంలో సోమవారం ‘జీవ’ వాటర్ బాటిళ్లను టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్తో కలిసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘జీవ’ వాటిర్ బాటిళ్లను తొలివిడత నగరంలో ప్రారంభించామని, వారంలోగా రాష్ట్రంలోని అన్ని డిపోల్లో విక్రయిస్తామని వెల్లడించారు. నిత్యం 30 లక్షల బాటిళ్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు చెప్పారు.
ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలతో టీఎస్ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీలో దాదాపు 50 వేల మందిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఆర్టీసీ ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర సర్కారు డీజిల్ ధరలు పెంచడంతో ఆర్టీసీపై ఆర్థికభారం పడుతున్నదని చెప్పారు. అయినా ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మూడేండ్ల కిందటే చెప్పారని గుర్తుచేశారు. నష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకొనేందుకు తెలంగాణ సర్కారు రూ. 1500 కోట్లు కేటాయించిందని వివరించారు. ఆన్లైన్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకొన్న ప్రయాణికులకు తిరుపతిలో ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఇటీవల 760 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. హన్స కన్సల్టెన్సీ సహకారంతో ‘జీవ’జలం పేరిట రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్స్టేషన్లలో మంచినీటి బాటిళ్లను విక్రయిస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు.
అనంతరం ‘జీవ’ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసేందుకు ఎంజీబీఎస్లోని స్టాల్ నిర్వాహకులు ముందుకురాగా, వారికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ బాటిళ్లను అందజేశారు. టీఎస్ఆర్టీసీ కళా బృందం ప్రదర్శన విశేషంగా అకట్టుకున్నది. కార్యక్రమంలో రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈడీలు వినోద్కుమార్, యాదగిరి, పురుషోత్తం, రంగారెడ్డి, రీజియన్ ఆర్ఎం ఏ శ్రీధర్, డిప్యూటీ ఆర్ఎం ఆపరేషన్స్ జ్యోతి, సీఆర్ఎం, ఎంఆర్సీ, పలు డిపోల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.