హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ వరంగల్ పర్యటనను నిరసిస్తూ రెండోరోజు కూడా సీపీఐ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, రామగుండం, శ్రీరాంపూర్ , మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి తదితర అన్ని సింగరేణి ప్రాంతాల్లో దాదాపు 12 వేల కార్మికులు నల్లబ్యాడ్జీలను ధరించి విధులకు హాజరయ్యారు.
సీపీఐ అనుబంధ ప్రజాసంఘాలు హైదరాబాద్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్ నుంచి హిమాయత్నగర్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కొత్తగూడెంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగాల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ.. తాను ఇస్తానన్న ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.