జైనూర్, జనవరి 17: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి సవరణ చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డ్రైవర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో లారీ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ ప్రధాన రహదారిపై డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించగా, ఎమ్మె ల్యే కోవ లక్ష్మి పాల్గొని వారికి మద్దతు తెలిపారు. ఇలాంటి చట్టాలతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడే అవకాశమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రం పునరాలోచించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆదిలాబాద్లోనూ లారీ యజమానులు, డ్రైవర్లు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ఆ తరువాత ధర్నా చేసి, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.