ఖానాపూర్, మార్చి 9 : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో మంచినీటికి కటకట నెలకొన్నది. దీంతో స్థానికులు శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు, బకెట్లతో నిరసనకు దిగారు. కుమ్రంభీం కాలనీ వద్ద దాదాపు పదికిపైగా బ్లాకుల్లో 400 కుటుంబాలు డబుల్ బెడ్రూం ఇండ్లల్లో నివాసం ఉంటున్నాయి. వీటికి రెండు బోర్లు ఉండగా.. వీటి ద్వారానే మంచినీరు సరఫరా అవుతున్నది. వారం రోజుల క్రితం ఒక బోరు పాడైందని, దీంతో దాదాపు 200 కుటుంబాలకు నీటి సరఫరా కావడం లేదని స్థానికులు తెలిపారు. వేసవికి ముందే నీటి కష్టాలు తీవ్రమైనట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నీటిని సరఫరా చేయాలని కోరుతున్నారు. దాదాపు గంటకుపైగా ఆందోళన నిర్వహించగా.. మున్సిపల్ చైర్మన్ సత్యం, వైస్ చైర్మన్ సంతోష్ అక్కడికి చేరుకుని రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాటర్ ట్యాంకర్ల ద్వారా పట్టణంలోని 12 వార్డులతోపాటు డబుల్ బెడ్రూం ఇండ్ల వద్దకు నీటిని సరఫరా చేయిస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు.