బోధన్, జనవరి 25: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి నిరసనసెగ తగిలింది. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్లో మైనారిటీ బాలుర గురుకుల భవనం ప్రారంభోత్స వం, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సుదర్శన్రెడ్డి కాన్వాయ్ పట్టణంలోకి ప్రవేశించగానే, బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ కారును అడ్డంగించేందుకు దూసుకువచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నిధు లు మంజూరై నిర్మించిన పనులకు ప్రారంభోత్సవాలు చేయడమే తప్ప, రెండేండ్లుగా బోధన్లో కొత్తగా పనులు ఎందుకు చేపట్టడంలేదంటూ ఆందోళనకు దిగారు. ‘సుదర్శన్రెడ్డి గో బ్యాక్’, ‘సుదర్శన్రెడ్డి డౌన్-డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్కు అడ్డుపడటంతో పోలీసులు, కాంగ్రెస్ నా యకులు కంగుతిన్నారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించా రు. సుదర్శన్రెడ్డి పర్యటన అనంతరం మధ్యాహ్నం వారిని విడుదలచేశారు. బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. పట్టణంలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ హయాంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ మంజూరుచేశారని తెలిపారు. ఆ భవనానికి తానే ఏదో చేసినట్లుగా సుదర్శన్రెడ్డి ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.